సుందరకాండ...! అది ఓ మానసిక విశ్లేషణా శాస్త్రం!
"బుద్ధిర్బలం యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతాః!
అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్"

అసలు పూర్తిగా రామాయణమే ఒక సంపూర్ణ మానసిక శాస్త్రం. అందునా సుందరకాండ బహు సుందరంగా మానసిక సంఘర్షణను చూపించి విజయానికి ఎలా పయనమవ్వాలో నిరూపిస్తుంది. అసలు రామాయణమే ఒక జీవి ఆధ్యాత్మిక జీవితానికి దర్పణం. అయోధ్యలో ప్రజలు ఎంత గొప్పవారో వివరిస్తారు. ధర్మం గురించి చెబుతారు.
అదే లంకలో నగరం ఎంత సుందరమో చెబుతారు. ఇక్కడ భౌతిక౦గా ఎంత ఉన్నతంగా ఈనగరం వుందో విశ్లేషణ చేస్తే అయోధ్యలో ధార్మికత, ఆధ్యాత్మికత గురించి చెబుతారు వాల్మీకి మహర్షి. దశరధుడు అన్నదే పంచకోశ పాంచ భౌతిక శరీరం, అతడి ముగ్గురు భార్యలే ఆజీవికి సంబంధిత ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలతో యజ్ఞం చేసి ధర్మార్ధకామమొక్షాలనే చతుర్విధపురుషార్థాలు సాధించడం! అదే లంకలో రజో గుణ దశకంఠ రావణుడు, తమోగుణ కుంభకర్ణుని మట్టుబెట్టి సత్త్వ గుణవిభీషణుని నిలబెట్టడం.
మన మనస్సులో ఆలోచనలే ఒక పెద్ద వానర సమూహం, దాన్ని నియంత్రించి కామం దాచిన జీవాత్మను పరమాత్మకు చేర్చడమే లంకా పయన, రావణ సంహార ఘట్టం. నూరు యోజనాలు దాటడానికి తనకున్న బలం మీద నమ్మకం లేకపోతే జాంబవంతుడు అతడికి తన బలం గురించి తెలియ చేస్తే రివ్వున లంకకు పయనమయ్యాడు పవనసుతుడు. ఆయన ఎన్నో చోట్ల తల్లి సీతమ్మ కోసం వెతుకుతాడు. చూడరాని ఎన్నో సన్నివేశాలను చూసాడు. కానీ తనకు మానసిక దౌర్భాల్యం, లౌక్యం లేదని సమాధానపడి సీతమ్మ కోసం వెతుకుతూ తిరుగుతుంటాడు స్వామి హనుమ.
ఎంత వెదకినా తల్లి కనబడక ఎంతో నిరాశకు గురవుతాడు. అసలు తల్లి దొరకకపోతే తాను అక్కడే వుండి తపస్సు చేసుకుందామని, లేదా ప్రాయోపవేశం చేసి తనువు చాలిద్దామని ఎన్నో ఆలోచనలు. అందునా కొన్ని కొన్ని సందర్భాలలో ఎంతో నిస్పృహకు గురయ్యి సాక్షాత్తు హనుమంతుల వారే ఆత్మహత్య గురించి ఆలోచిస్తారు. దాని నుండి ఎలా బయటపడాలో ఆయన ద్వారా చూపెడతారు వాల్మీకి. ఎక్కడికక్కడ సమాధాన పరుచుకుంటూ ముందుకు కదులుతాడు. జీవించి వుంటే ఎప్పటికైనా విజయం సాధ్యం అవుతుందని హనుమంతుని ఆలోచన ద్వారా మనకు సందేశం ఇస్తాడు మహర్షి.
ఒకానొక సమయంలో ఈ రాక్షసులు సీతమ్మను తినేసారా అని భీతిల్లి తానక్కడ నిరాహారంగా నిర్వాణం పొందుదామని ఆలోచిస్తాడు. ఇంతలో వివేకం తొంగి చూసి అసలు దీనికి కారణం అయిన రావణుని చంపి పాతరేద్దామని, లేదా కట్టి తీసుకెళ్ళి రాముని ముందు పడేద్దామని మరల రోమాంచితుడవుతాడు.
చివరకు హనుమంతునికి సీతమ్మ దర్శనం అవుతుంది. ఎంత గొప్పవారికైనా క్లేశాలు తప్పవు, అసలు సీతమ్మే ఇటువంటి స్థితికి వచ్చిందంటే కాలం ఎంత బలీయమైనదో అని అనుకుంటాడు.
ఇక్కడ ఒక కార్యం సాధించవలసి వచ్చినప్పుడు మనకు కూడా ఎదురయ్యే సంగతులే. ఎంతో ప్రయత్నం చేసినా కొన్ని సార్లు ఎక్కడా కూడా మనం ఆ ఫలితం కనబడడం లేదని డీలా పడిపోతాము. మరికొంత ప్రయత్నం చేస్తే సాధించవచ్చు అన్న ధైర్యాన్ని కోల్పోతాము. మనవంటి వారికి ధైర్యం చెప్పడానికి అతి బలవంతుడైన హనుమంతునే ఎదురుగా పెట్టి మనకు పాఠం నేర్పుతారు. ఎన్నటికీ ధైర్యం కోల్పోకూడదని, సమయం ఆసన్నమైనప్పుడు, మన ప్రయత్న లోపం ఏమీ లేనప్పుడు తప్పక మనకు ఫలితం దక్కుతుంది. మన వాంగ్మయం మనకు ధైర్యాన్నే నేర్పుతుంది.
స్వామీ వివేకానందుల వారు అన్నట్టు మన వేదం మొత్తం కేవలం ధైర్యం, సంకల్ప బలం గురించి మాత్రమె చెబుతుంది. దైవం మీద భారం వేసి త్రికరణ శుద్ధిగా మనం ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తాం. ఎప్పుడైనా కొంత మనకు నమ్మకం సన్నగిల్లినప్పుడు, ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితం రానప్పుడు పెద్దలు సుందరకాండ పారాయణం చెయ్యమంటారు.
ఆ పారాయణం వలన ఆ మంత్రరాజ ఫలితంగా ఆధిదైవిక అడ్డంకులు ఏమున్నాయో అవి తొలగిపోతాయి. ఆ ఘట్టాలు మనం పూర్తిగా చదవడం వలన తత్త్వం బోధ పడి, మనమీద మనకు నమ్మకం కుదిరి మన ప్రయత్నాలను మరింత జాగ్రత్తగా పదును పెట్టి ముందుకు వెళ్లి విజయాన్ని సాధించగలుగుతాము._
Courtesy ---- Chiluveru Ramchandra Murthy
నేను లేకపోతే?
అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని
కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు!
ఆశ్చర్య చకితుడయ్యాడు.
'"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు!
బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని.
సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు.
అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని.
**మరింత ముందుకు వెళితే
త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది.
అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు.
తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు
అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు.
*
హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు.
అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు.
అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని.
ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు.
అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు.
పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు.
అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది!
**
అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి.
ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం .
అందువల్ల
* నేను లేకపోతే ఏమవుతుందో*
అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు
'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు.
*భగవంతుడి కోటానుకోట్ల దాసులలో
అతి చిన్నవాడను*
అని ఎఱుక కలిగి ఉందాం.🙏
**********************************************************************************
మానవాళికి ఎక్కువ లబ్ది చేకూరాలంటే ఏయే చెట్లు నాటాలి.?
స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది.
అశ్వత్థమేకం పిచుమందమేకం
న్యగ్రోధమేకం దశ తిన్త్రిణీకం|
కపిత్థ బిల్వాఁ మలకత్రయాంచ పంచామ్రవాపీ నరకన్ న పశ్యేత్||.
అశ్వత్థ = రావి (100% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
పిచుమందా = నిమ్మ (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
న్యగ్రోధ = మర్రి చెట్టు (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
తింత్రిణి = చింత (80% కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది)
కపిత్థ = వెలగ (80% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
బిల్వ = మారేడు (85% కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది)
అమలకా = ఉసిరి (74% కార్బన్ డయాక్సైడ్ గ్రహిస్తుంది)
ఆమ్రాహ్ = మామిడి (70% కార్బండయాక్సైడ్ గ్రహిస్తుంది)
వాపి - నుయ్యి
అర్థం
ఈ చెట్లను నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించినవారు నరకం చూడవలసిన అవసరం ఉండదు.
--------------------------------------
(ప్రస్తుత కలుషిత వాతావరణం)
మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది.
ఈ చెట్లన్నీ వాతావరణంలో ఆక్సిజన్ను పెంచుతాయి.
అలాగే, ఇవి భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి.
ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢ నమ్మకాలుగా భావించి, విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకుని క్వటర్స్ చెట్లు పెంచుతున్నాం.
-------------------------------
మూలే బ్రహ్మ చర్మం విష్ణు శాఖ శంకరమేవచ|
పత్రే పత్రే సర్వదేవయం వృక్ష రాజ్ఞో నమోస్తుతే||
భావం: ఏ మూలంలో బ్రహ్మ, కాండములో విష్ణువు, శాఖలలో శంకరుడు, ఆకులలో సర్వ దేవతలు నివసిస్తారో అటువంటి వృక్షరాజం రావిచెట్టుకి నమస్కారాలు.
గ్రంథాలలో, రావి చెట్టుని చెట్లరాజు అని పిలుస్తారు.
రాబోయే సంవత్సరాల్లో రావి, మర్రి, వేప, మారేడు, ఉసిరి చెట్లను నాటితేనే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుంది.
మన సంఘటిత ప్రయత్నాల ద్వారానే మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుకోగలము.
భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈరోజు నుంచే మొక్కలు నాటడం ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
మొక్కలు నాటడం ద్వారా రాబోయే తరానికి ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడానికి ప్రయత్నిద్దాం.
🌳🥦🌴🌲
Courtesy : Mr. C.Ramchandra Murthy
*********************************************************************************
శంకర జయంతి
మే 02 శుక్రవారం శ్రీ శంకర జయంతి సందర్భంగా...
శంకరులు హైందవ ధర్మ పునరుత్థా నానికి పునాదులు వేసిన ఆదిగురువు. 'అహం బ్రహ్మాస్మి', 'తత్వమసి' అని ప్రవ చిస్తూ కాలాతీత దివ్యత్వమైన పరబ్ర హ్మాన్ని తన అద్వైత సిద్ధాంతాలతో మానవాళికి విశదపరచిన మహాజ్ఞాని. హరిహర భేదాన్ని సులభ గ్రాహ్యం చేసే శివానందలహరి, సౌందర్య లహరి, భజ గోవిందం వంటి ఉత్కృష్ట రచనలతో వేదాంతసారం కరతలామలకం కావించి నిత్య పారాయణానికి అందుబాటులోకి తెచ్చి ఆధ్యాత్మిక హృదయాలకు ఆనందం కలిగించారు.
మనిషి చూస్తున్న ప్రపంచం, కార్య కారణ పర్యవసానాల మధ్య సాగే ఒక మహా నాటకమని గుర్తించిన మహామేధావి శంకరులు. ఆయన ప్రతిపాదించిన అద్వైత వాదానికి మూలసూత్రమైన కర్మ సిద్ధాంతం చెప్పేది ఈ కార్యకారణాలనే. భౌతిక ప్రపంచంలో మనిషి ఉనికిని ప్రభావితం చేసేవి ఈ కార్యకారణాలే నని, ఆత్మకు మాత్రమే వాటిని నియంత్రించగల శక్తి ఉందని తెలియజెప్పారు. కార్యకారణాల ప్రభావం సన్నగిల్లాలంటే 'నువ్వెవరో' నువ్వు ముందు తెలుసుకోవాలన్నారు. సకల చరాచర జగత్తు ఒకే ఒక ఆత్మతత్వం నుంచి ఉద్భవిం చిందని, జీవాత్మ పరమాత్మలన్నవి ఒక్కటేనని, ద్వైతానికి తావే లేదని ఆయన నిర్ద్వందంగా చెప్పారు. ఆ సిద్ధాంత సారమే ఆయన మన ముందుంచిన మాయావాదం. జగత్తును సృష్టిం చింది దేవుడని ఆయన ఒక్కడే మనుషుల కర్మ లన్నీ నిర్దేశించి కర్మఫలాలు నిర్ణయిస్తాడని నిర్దుష్టమైన వాదనలతో నిరూపించారు. ఆయన తార్కిక జ్ఞానం తిరుగులేనిది. తెలిసిన దాని నుంచి తెలియని ఆ బ్రహ్మాన్ని చేరుకునే శరణాగ తుడు కాగల అత్యుత్తమ అవస్థకు మనిషిని చేర్చేలా ఆయన వాదనలుంటాయి.
శంకరులు వేదాల్లో ఉన్న వైదిక ధర్మాన్నంతా తన రచ నలన్నింటిలో పొందు పరచారు. పది ఉపనిషత్తుల్ని ఎంచుకుని భాష్యాలు రచిం చారు. అవి ఈశ, కేన, కథ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తరీయ, ఐతరేయ, చాందోగ్య, బృహదారణ్యక ఉపనిషత్తులు. ప్రపంచంలో లౌకిక మనిషికి తానున్న వాతావరణంలో, జగన్మిథ్యత్వం అంటే ఏమి టని అర్థం కావటానికి, అనే కత్వ భావనల నుంచి అతణ్ని బయట పడవేయ టానికి సుగమమైన మార్గా లన్నీ ఆయన చేసిన అన్ని రచనలూ ప్రస్ఫుటిస్తాయి. అద్వైత జ్ఞానభక్తికి ఆయన ఆద్యులు. గంగాభిషేకంలో హరిహరులని ఆయన ద్వైతం లేని దివ్యత్వంపై తన మనసు లగ్నమ య్యేలా అనుగ్రహించమని అర్థిస్తారు. దేహం కలిగించే
నేను' అనే భావన తొలగి, సర్వబంధాల నుంచి విముక్తి కలిగి, తిరిగి తానే అనంత దైవత్వంలో లీనం కావటానికి ఆయన చేసిన ప్రార్థనల సారాంశమే వివేక చూడామణి. విష్ణుసత్పతిలో అహంకార రహితుణ్ని చేసి, బుద్ధికి ఉపశమనం కలిగిస్తూ, కోరికలకు, దురాశకు దూరంగా తనను నడిపించమంటారు.
వైదిక కర్మలన్నీ దేహాన్ని, మనసును శుద్ధిప రచుకుని వేదాంత జిజ్ఞాస పెంపొందిం చుకునేందుకే ఉన్నవని నమ్మిన శంకరులు వేదాంత విచారం కోసం- ఇతర వర్ణాశ్రమాల కన్నా, సన్యాసాశ్రమమే సరైనదని భావిం చారు. అతి పిన్నవయస్సులోనే అది స్వీకరిం చారు. అహాన్ని అధిగమించి దాని స్థానంలో ఆత్మసాక్షిని ప్రవేశపెట్టుకునేందుకు అదే సరైనదని అనుకున్నారు. పన్నెండు సంవత్స రాల ప్రాయంలోనే వేదాలు నాలుగూ క్షుణ్నంగా అధ్యయనం చేసి పన్నెండు శాస్త్రాల్లో తిరుగులేని పాండిత్యం సంపాదించారు. ఆనేతు హిమాచల పర్యంతం కాలినడకన పర్యటించి సనాతన ధర్మ సత్ సంప్రదాయాలను సంరక్షించారు. హైందవ ధర్మజ్యోతి నిరంతరం వెలుగుతూ ఉండేందుకు దేశం నలుమూలలా ధర్మపీఠాలు ఏర్పా టుచేశారు. పరమశివుడి అపరావతార మని అందరూ నమ్మే ఆ మహాగురువు, నాలుగు పదుల వయస్సు నిండకుండానే శివ సాయుజ్యం పొందారు. మే నెలలో వైశాఖ శుక్ల పంచమినాడు జరిగే ఆయన జయంతి హిందూ ధర్మావలంబులు అందరికీ పర్వదినం.
*******************************************************************************
సర్వదేవాత్మకుడు ఆదిత్యుడు
మే 04 భానువారం భాను సప్తమి సందర్భంగా...
ప్రాతఃకాలాన్నే స్నానం చేసి, శుచిగా సూర్యుని నమస్కరిస్తే చాలు- పాప నిర్మూలనం జరిగి, పవిత్రులమ వుతామని మహాభారతంలో శ్రీకృష్ణుడు బోధించాడు.
సూర్యోదయ సమయంలోని రోగహరణ శక్తే ఉష సూర్యకిరణాల వలన కలిగే వికసనశక్తి చేతనే సర్వ జగతి చేతనత్వం పొందుతోంది. ఆ శక్తినే 'పద్మిని' అన్నారు. ప్రతిబింబశక్తిని 'ఛాయ'గా చెప్పారు.
వీరే సూర్యుని భార్యలు.
సౌమ్యత, తీక్షత, ప్రశాంతం, ప్రచండం.... అన్నీ సూర్యునిలోనే మనం చూడవచ్చు. ఘోరం, అఘోరం.... ఈ రెండింటితోనూ ప్రపంచాన్ని ప్రభావితం చేసే వాడీ తడే కనుక రుద్రుడనీ, శివుడనీ, దిక్కులకు పతి అనీ వేదం పేర్కొంది.
సూర్యుని నుంచే దిక్కులు ఏర్పడుతున్నాయి. సూర్యో దయ దిశను తూర్పుగా తెలుసుకున్నాకనే, మిగిలిన దిశలను నిర్ణయిస్తున్నాం.
కనుక 'దిశాంచ పతయే నమః' అని శ్రుతిమంత్రం వినుతించింది. ఆ కిరణాలే ఆయనకు సహస్రకరాలు.
ఇవ్వడం, లాలించడం, పాలించడం, కర్మచేయడం చేతుల లక్షణం. సూర్యకిరణాలు ఈ నాలుగు పనులతో విశ్వానికి హితాన్నీ, రమ్యతనీ అందిస్తాయి. కనుక 'హిరణ్యబాహువు' అని కీర్తించారు. ఈ కిరణాలను ప్రపంచమంతా పరచి వాటి ద్వారా సకల చరాచరాలకు ప్రాణశక్తిని అందిస్తున్న వ్యాపకత్వం చేత ఈయననే 'విష్ణువు' అన్నారు.
కిరణాలకున్న గమనలక్షణం బట్టి 'గరుత్మంతుడ'ని పేర్కొన్నారు. కిరణాలనధిష్ఠించిన ఆదిత్యుడు గరుడ వాహనారూఢుడు.
సూర్యుని చైతన్యశక్తే జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. అందుకే లక్ష్మిగా, పరాశక్తిగా జగదంబగా సౌరశక్తిని ఆరాధిస్తున్నాం. (భాను మండల మధ్యస్థా.... లలితా సహస్రనామాల్లోని ఒక నామం.) సూర్యకిరణాలు తీక్షణంగా ఉన్నా, సౌమ్యంగా ఉన్నా పరిణామంలో మనకు మంగళ కరాలు. మంగళమే ఆయన స్వభావం. అందుకే 'శివుడు' (మంగళమయుడు) అని ఆయనను నుతించారు (ఆదిత్యంచ శివం విద్యాతే... శాస్త్రోక్తి).
ప్రాణశక్తి ప్రదానంతో సృష్టిని నిర్వహిస్తాడు- కనుక బ్రహ్మ, స్థితి, పోషణ కలిగించే శ్రీహరి. 'వారం' అంటే సర్వజీవసమూహం. వారికి శక్తినిచ్చే ఆశ్రయ శక్తి (ఆయనం) ఈతడే కనుక సూర్యనారాయణుడు.
'ఇంద దీప్తౌ' 'ఇది ఐశ్వర్యే' - అనే సంస్కృత ధాతువుల ననుసరించి ప్రకాశ, ఐశ్వర్య లక్షణాలచేత సూర్యుని 'ఇంద్రుడు' అన్నారు.
కిరణాల్లోని జిడ్డుశక్తి 'మిత్ర', పోషణశక్తి 'పూష', ఆర్ద్రత 'వరుణ'. ఇలా సర్వదేవతలు సౌరశక్తి విశేషాలే. అందుకే వేదం ఏకం సత్ విప్రాః బహుధా వదన్తి అనే మంత్రాన్ని సూర్యపరంగానే చెప్పింది.
ఒకే సూర్యశక్తి పలు విధాలుగా జగతిని అనుగ్రహిస్తోంది.
సూర్యుడు జడ ప్రకృతి కాదు, పూర్ణచైతన్యం. సకల జగన్నిర్వహణ చేసే పరబ్రహ్మ చైతన్యం సూర్యుని ద్వారా మనల్ని అనుగ్రహిస్తున్నది. కనుక సర్వ దేవమయుడు ఆదిత్యుడు. సర్వదేవతాత్మకుడైన సూర్యుని ప్రకాశ దాహక శక్తినే యజ్ఞాగ్నిగా రగిల్చి, సర్వదేవతలను ఆరాధించే యజ్ఞసంస్కృతి మనది.
అఖండ తేజః స్వరూపుడైన ఆదిత్యుని మాఘ మాసం నుంచి మనం మరింత కాంతులతో గ్రహించనున్నాం.
ఉత్తరాయణ పుణ్యవేళ, దైవీయమైన సూర్యకాంతులు మన ప్రాంతాలకు సముజ్జ్వలంగా లభిస్తాయి.
ఈ కాంతిగమన పరిణామాన్నే 'రథం మారడం'గా చెప్పి, సప్త సంఖ్యా ప్రధానత చేత 'సప్తమి' తిథిని 'రథసప్తమి'గా సూర్యారాధనకు వినియోగిం చడం మన సంప్రదాయం. వారాలలో తొలి దినమైన ఆదివారం, తిథుల్లో సప్తమి - సూర్యారాధనకు ప్రశస్తం.
సూర్యనమస్కారం, ఆరాధన వైజ్ఞానికంగా, ఆధ్యాత్మికంగా కూడా సాఫల్యమైన భవ్య సంస్కృతి.
🙏🙏
Comments
Post a Comment